నల్లగొండ తాజాకబురు లైన్ :సాంకేతిక పరిజ్జానం ఆకాశం అంచున తాకుతుందని సంబరపడిపోదామా లేకా పెరుగుతున్న సాంకేతికతో వినాశనాలు జరుగుతున్నాయని బాధపడుదామా , ఇప్పుడు నల్లగొండ జిల్లాలో అలాంటి సంఘటనె చోటు చేసుకుంది…
హుజూర్నగర్ మండలంలోని గోవిందాపురంలో గురువారం రాత్రి ఆన్లైన్లో చూస్తూ శ్మశానవాటికలో చేతబడి చేస్తున్న నలుగురు యువకులను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
వివరాలిలా ఉన్నాయి.. గోవిందాపురం గ్రామానికి చెందిన రాము, శ్రీకాంత్, వెంకటేశ్వర్లు, రవి గురువారం అర్ధరాత్రి పక్కనే ఉన్న శ్మశానంలో ఒంగోలు, ఖమ్మం పట్టణానికి చెందిన వారు వీడియో కాలింగ్ ద్వారా మంత్రాలు చెబుతుండగా వాటిని పలుకుతున్నారు. స్థానికులు గమనించి కర్రలతో దాడి చేసి గ్రామంలోకి తీసుకొచ్చారు. ఆ సమయంలో రవి తప్పించుకుపోయాడు. రాత్రి కావడంతో శుక్రవారం ఉదయం మాట్లాడుకుందామని గ్రామ పెద్దలు యువకులను ఇంటికి పంపించారు. ఉదయం యువకులను పిలిచిన పెద్ద మనుషులు.. శ్మశానంలో ఏం చేస్తున్నారని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు యువకులను చితకబాదారు. అనంతరం వారు పూజలు చేసిన చోటుకు తీసుకెళ్లారు. అక్కడ మట్టిని తవ్వగా.. ఇద్దరి మహిళల పాస్ ఫొటోలు, చీరె, జాకెట్, రెండు నల్ల కోళ్లు, నిమ్మకాయలు, వెంట్రుకలు, కొబ్బరికాయలు, పిండితో చేసిన బొమ్మ బయటపడ్డాయి.
గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేసి యువకులను అప్పగించారు. వారిని ఎస్ఐ అనిల్రెడ్డి మందలించి పంపించారు. ఈ విషయంపై సంబంధిత యువకులను ప్రశ్నించగా.. తమ కుటుంబంలో సమస్యలు ఉండటంతో ఒంగోలుకు చెందిన పూజారిని కలిశామన్నారు. పూజారి చెప్పినట్లు శ్మశానంలో పూజలు చేసుకుంటున్నామని పేర్కొన్నారు. తాము చేతబడి చేస్తున్నామనుకొని గ్రామస్తులు పట్టుకుని కొట్టారని తెలిపారు. తమ సమస్యలను తొలగించుకోవడానికి మహిళలే వారి ఫొటోలు ఇచ్చారని చెప్పారు.